ఓటీటీ విడుదలపై ‘నిశ్శబ్దం’ వీడిన కోన
on Jun 6, 2020
థియేటర్లలో విడుదల చేస్తారా? ఓటీటీలోనా? అనుష్క ‘నిశ్శబ్దం’ వెండితెరపైకి వస్తుందా? డిజిటల్ తెరపైకి వస్తుందా? అనే విషయంలో ఇకపై సందిగ్ధం అవసరం లేదు. ఓటీటీలో విడుదల చేసే విషయమై దర్శకుడు, రచయిత, నిర్మాతలు నడుమ ఏకాభిప్రాయం వచ్చిందని తెలుస్తోంది. థియేటర్లలో కాకుండా ఓటీటీలో విడుదల చేయడానికి అందరూ అంగీకరించారట. తొలుత థియేటర్లలో సినిమా విడుదల చేయడానికి సినిమా తీశామని సినిమా రచయిత, నిర్మాతలలో ఒకరైన కోన వెంకట్ గతంలో వ్యాఖ్యానించారు. సెన్సార్ పూర్తయ్యాక దర్శకుడు హేమంత్ మధుకర్ సైతం థియేటర్లలో సినిమాను విడుదల చేయమని సెన్సార్ సభ్యులు సలహా ఇచ్చినట్టు చెప్పుకొచ్చారు.
ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఇప్పట్లో థియేటర్లు ఓపెన్ అయ్యే అవకాశాలు దరిదాపుల్లో కనిపించడం లేదు. అందుకని, ఓటీటీలో ‘నిశ్శబ్దం’ చిత్రాన్ని విడుదల చేయడానికి సిద్ధమయ్యారు. ‘‘థియేటర్లు ఓపెన్ కాకపోతే ఓటీటీలో సినిమాను విడుదల చేస్తాం’’ అని కోన వెంకట్ స్టేట్మెంట్ ఇవ్వడం వెనుక కారణమదే. అనుష్క, మాధవన్, అంజలి, షాలినీ పాండే తదితరులు సినిమాలో నటించారు. తెలుగులో అనుష్కకు, తమిళంలో మాధవన్కు, తెలుగు–తమిళ భాషల్లో అంజలికి మార్కెట్ ఉంది. రణవీర్ సింగ్తో సినిమా రావడంతో హిందీలో షాలినీ పాండే పేరు ఇప్పుడిప్పుడే ప్రేక్షకులలోకి వెళుతోంది. అందువల్ల, సినిమాకు మంచి రేటు వచ్చేలా ఉంది.